ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా భారీగా బలగాలను మోహరించారు. ఆప్ సర్కారును ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఈ కేసు పురోగతిలో భాగంగానే గురువారం సాయంత్రం ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం జరిగింది. అయితే కోర్టు కేజ్రీవాల్ తనపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని వేసిన పిటిషన్ ను తోసిపుచ్చడంతో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఈడీ జారీ చేసిన సమన్లకు సంబంధించి అరెస్టు నుండి ఎటువంటి మధ్యంతర రక్షణను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో గురువారం సాయంత్రం ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఆయన్ని లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ సీఎం నివాసం దగ్గర భారీగా బలగాలు మోహరించాయి.




