స్మార్ట్ ఫోన్లో ఎక్కువ మంది వినియోగించే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికగా సైబర్ కీచకులు రెచ్చిపోతున్నారు
ఆర్థిక, లైంగిక నేరాలకు తెగబడుతున్నారు. ఈ యాప్లను వినియోగిస్తున్న వారి మానసిక స్థితి ఆధారంగానే హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడుతున్నారు. యాప్లలో రిజిస్ట్రేషన్, వినియోగం, సమాజ పోకడలపై అవగాహన లేని వ్యక్తులే సైబర్ కీచకుల వలలో చిక్కి మోసపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.
నేరగాళ్లు ముందుగా ఆయా యాప్ల సెర్చ్ బాక్స్ల్లో రాండమ్గా కొన్ని పేర్లను వెదుకుతారు. ఆయా పేర్లతో ఉన్న యాప్ల అకౌంట్లలో ఎంత మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఉన్నారు, ఏఏ తరహా వీడియోలు/ఫొటోలను షేర్ చేస్తున్నారు వంటి అంశాలను క్షుణ్ణంగా గమనిస్తారు. ఆ తరువాత వారి ఫ్రెండ్స్ లిస్ట్లోని ఒకరిని ఎంచుకుంటారు. ఆ వ్యక్తి ఫ్రెండ్ లిస్ట్లోని ఒకరి ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి స్తారు. ఫ్రెండ్కి ఫ్రెండే కదా అని రిక్వెస్ట్ అంగీకరించి లిస్ట్లో చేర్చుకున్న తరువాత తమ పని మొదలు పెడతారు. తియ్యల పదాలతో చాటింగ్ చేస్తూ దగ్గరవుతారు. చాటింగ్లోనే ఫోన్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలన్నీ సేకరిస్తారు. అక్కడ నుంచి ఫోన్లో తరుచూ మాట్లాడటం, ఆ తరువాత వీడియో కాల్తో ముగ్గులోకి దించి బ్లాక్మెయిల్కు తెగబడతారు. పలువురు మహిళలు ఇలా కీచకుల వలలో చిక్కుకుని లైంగిక వేధింపులకు గురైన ఘటనలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. మూడేళ్ల క్రితం వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ కేంద్రంగా ఈ తరహా నేరాలు జరిగేవి. తాజాగా హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా సైబర్ కీచకులు నేరాలకు తెగబడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
సోషల్ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో, అంతే స్థాయిలో అనర్థాలున్నాయి. సైబర్ నేర గాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో ఈ నేరాలపై నిత్యం ఏదో ఒక విద్యాసంస్థ లేదా ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఎలాంటి సైబర్ నేరం బారిన పడినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. లైక్లు, షేర్ల మోజులో పడి ఆగంతకుల చెరలో చిక్కొద్దు అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.