కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డాక్యుమెంట్లో ఈడీలోని ఇద్దరు ఉన్నత అధికారుల గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం.. కేజ్రీవాల్కు మరిన్ని కష్టాలు తప్పవు. ఆయనపై గూఢచర్యం కేసు నమోదు కావచ్చు.
ప్రత్యేక డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు అందులో ఉన్నాయని.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను బయటపెట్టలేదని తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్లో ఉన్న అధికారుల్లో ఒకరి పేరు ఆ పత్రాల్లో ఉండటం చూసి అధికారులందరూ షాక్కు గురయ్యారు. ఆ పత్రంలో పేరున్న జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారి.. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్పై దర్యాప్తుని పర్యవేక్షిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ గురించి కేజ్రీవాల్ రిమాండ్ నోట్లో కూడా ప్రస్తావించబడింది. ఈ డాక్యుమెంట్ రికవరి చేసుకున్న తర్వాత.. ఇద్దరు ఈడీ అధికారులపై నిఘా పెట్టినందుకు గాను కేజ్రీవాల్పై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది కూడా పరిశీలిస్తోంది.
తదుపరి విచారణ, చర్యల కోసం.. దర్యాప్తు ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని ఏజెన్సీలోని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ డాక్యుమెంట్లో ఉన్న కచ్ఛితమైన సమాచారం బహిర్గతం కాలేదు కానీ.. ఈడీలోని సమగ్రత, ప్రోటోకాల్పై ప్రశ్నలు రేకెత్తుతోంది.
ఇదిలావుండగా.. గురువారం రాత్రి రెండు గంటల పాటు ప్ఱశ్నించిన తర్వాత కేజ్రీవాల్ని ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని తెలిపింది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ పేర్కొంది.




