చనిపోయిన అనంతరం ఒక వారసుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది.సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఇలాంటి వినతి చేసే అవకాశం అసలే లేదని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పి. రోహిత్ సూర్య అనే వ్యక్తికి, ఆయన తాత సుబ్బారావు కొండాపూర్లోని జాగృతి ఫౌండేషన్స్లో 3, 4 అంతస్తులను రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేశారు. అయితే రోహిత్ తండ్రికి, సుబ్బారావు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో గిఫ్ట్ డీడ్ రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని సుబ్బారావు రాజేంద్రనగర్ ఆర్డీవోను సంప్రదించారు. విచారణ జరిపిన ఆర్డీవో… సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం దాన్ని రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా రద్దు చేయడం చెల్లదని పేర్కొంటూ రోహిత్ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ సిటిజన్స్ చట్టంలోని సెక్షన్ 23 (1)లో పేర్కొన్న విధంగా వృద్ధుల బాగోగులను చూసుకోవడం వంటి షరతులను గిఫ్ట్ డీడ్లో పేర్కొనలేదని తెలిపారు. అదీకాకుండా ఆర్డీవో ఆదేశాలు ఇచ్చిన తర్వాత తమ తాత చనిపోయారని తెలిపారు. అందువల్ల ఇతర వారసులు కూడా గిఫ్ట్ డీడ్ను రద్దు చేయాలని కోరలేరని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం.. దీంతో ఏకీభవించింది.. వృద్ధులు జీవించి ఉన్నంత వరకే సీనియర్ సిటిజన్స్ చట్టం వర్తిసుందని తెలిపారు. తాత చనిపోయిన దృష్ట్యా గిఫ్ట్ను రద్దు చేస్తూ ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేశారు.
అండమాన్కు నైరుతి రుతుపవనాలు?
ద్రోణి కారణంగా రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షపాతం నమోదయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిశాయి. రాగల 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురవడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 4-5 రోజుల్లో అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం, మాల్దీవులు, కోమోరిన్, దక్షిణమధ్య బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలో రుతుపవనాల పురోగతికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది వర్షాకాల ప్రవేశాన్ని సూచించే కీలకమైన దశగా పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
వికారాబాద్లో ఈదురుగాలుల బీభత్సం
పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో సోమవారం భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సాన్ని సృష్టించాయి. కొన్నిచోట్ల భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడ్డాయి. మన్నెగూడ-వికారాబాద్ రోడ్డులో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పోలీసులు స్థానికుల సహాయంతో రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడలో గాలివానకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కూలి ట్రాన్స్ఫార్మర్తో పాటు విద్యుత్ స్తంభం నేలకొరింది. కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని నిల్యా నాయక్ పౌల్ర్టీఫామ్లో ఆదివారం ఈదురు గాలులకు దాణా యంత్రం కూలడంతో పౌల్ర్టీ యజమానితో పాటు కూలీలకు గాయలయ్యాయి.పౌల్ర్టీ యజమాని నిల్యా నాయక్ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరు: హైకోర్టు
RELATED ARTICLES