గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి ఎలాగైనా తన సొంతం చేసుకోవడానికి మరొకరికి దగ్గరవడం భరించలేక.. మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టానని సినీనటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
యువతి ఆత్మహత్యకు కారణమైన జగదీశ్ను ఇటీవల పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. సినీ అవకాశాల కోసం నగరానికి చేరిన జగదీశ్కు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది. ఈవిషయాన్ని తెలుసుకొని భరించ లేక ఎలాగైనా ఆమెను తిరిగి ఎప్పటి లా సొంతం చేసుకునేందుకు..పక్కా స్కెచ్ చేసుకొని ప్లాన్ చేశాడు జగదీష్
పోలీసులు తేయిపిన వివరాల ప్రకారం గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.




