ప్రజల తరఫున నిలబడి అక్రమాలను వెలుగులోకి తేవాల్సిన మీడియా వ్యవస్థనే ఆయుధంగా మార్చుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తూ కోట్ల డీల్ నడిపిన ఓ న్యూస్ ఛానల్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతోంది. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కథనాలు వేస్తామని హడావుడి చేస్తూ, “డబ్బులు ఇవ్వకపోతే స్టోరీలు ఆపం” అంటూ పబ్లిక్ గానే హెచ్చరికలు జారీ చేసినట్లు కోబ్రా న్యూస్కు పక్కా సమాచారం అందింది.
ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రభుత్వ భూమిలో విల్లాలు నిర్మిస్తున్న అంశాన్ని ఆధారంగా చేసుకుని, సదరు న్యూస్ ఛానల్ భారీ హెడ్లైన్లతో వరుస కథనాలు ప్రసారం చేసింది. అదే సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు యూట్యూబ్ లింకులు పంపుతూ, “మేము అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే ఈ కథనాలు కొనసాగిస్తాం… చివరకు భూమి ప్రభుత్వానికి వెళ్లేలా చేస్తాం” అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఈ హడావుడితో భయపడిన రియల్ ఎస్టేట్ సంస్థ, భూమి తిరిగి ప్రభుత్వానికి వెళ్లిపోతుందన్న ఆందోళనతో కాకుండా, వ్యవహారం పెద్దదవుతుందన్న భయంతో ఛానల్ యాజమాన్యంతో రాజీకి వచ్చినట్లు సమాచారం. ఫలితంగా అసలు విలువ కోటి రూపాయలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని కేవలం 15 లక్షల రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి, అదే భూమిని “కోటి విలువైన ల్యాండ్” అంటూ చూపించి డీల్ పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఈ డీల్ను సెటిల్ చేసిన మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ “పెద్దమనిషికి” 10 లక్షల రూపాయల నగదు అందినట్లు కూడా సమాచారం. తెరపై నీతి వాక్యాలు చెబుతూ, ప్రజలను దేశాన్ని రక్షిస్తున్నానంటూ ప్రసంగాలు చేసే ఈ పెద్దమనిషి వెనుక జరిగిన లావాదేవీలు ఇప్పుడు అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా ఆ భూమి ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిగానే కొనసాగుతుండటం, భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లు, డబ్బులు కట్టిన రిసిట్లు, భూమి ప్రభుత్వ భూమేనని నిరూపించే ఆధారాలు అన్నీ కోబ్రా న్యూస్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజల కోసం ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన న్యూస్ ఛానల్, డబ్బుల కోసం అక్రమాలకు భాగస్వామిగా మారిందన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. “నీ చేతులు తడిపితే అన్యాయం న్యాయమైపోతుందా?” అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే అధికారులు రిపోర్టులు తెప్పించుకున్నారని,
– డీల్ ఎవరు చేశారు?
– ఎలా మాట్లాడారు?
– బెదిరింపుల కోసం పంపిన యూట్యూబ్ లింకులు ఏవి?
– మధ్యవర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు?
– అతనికి వచ్చిన 10 లక్షల నగదు మూలం ఏంటి?
– 15 లక్షల లావాదేవీ ఎలా జరిగింది?
అన్న అంశాలపై లోతైన దర్యాప్తు సాగుతోందని సమాచారం.
ఇప్పుడు గనుక ఈ వ్యవహారంలో ఏ చిన్న తేడా వచ్చినా, సదరు న్యూస్ ఛానల్ యాజమాన్యం పేరు బహిర్గతం కావడం ఖాయం. మధ్యవర్తి పాత్ర కూడా పూర్తిగా బయటపడనుంది. అప్పటికి ఈ కథనం ఒక రాజకీయ–మీడియా–రియల్ ఎస్టేట్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుందన్న చర్చ జరుగుతోంది.
ఇది అంతా కోబ్రా న్యూస్కు అందిన పక్కా సమాచారం. మరిన్ని సంచలన వివరాలు త్వరలో…




