సమాజంలో విలువలు నానాటికీ పతనమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను అతడితో కలిసి దారుణంగా హత్య చేసింది.ఆ తరువాత భర్తది సహజ మరణంగా చూపించేందుకు ప్రయత్నించి చివరకు అడ్డంగా బుక్కయిపోయింది. నాగ్పూర్లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది (Nagpur Woman Lover Murder Plot).
పూర్తి వివరాల్లోకి వెళితే దిశా రామ్టేకేకు(30) 13 ఏళ్ల క్రితం చంద్రసేన్ రామ్టేకేతో (38) వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, రెండేళ్ల క్రితం చంద్రసేన్కు పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు. నాటి నుంచి దిశ కుటుంబ భారాన్ని తలకెత్తుకుంది. వాటర్ క్యాన్స్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే, చంద్రసేన్కు ఎప్పటి నుంచో భార్య ప్రవర్తనపై అనుమానం ఉండేది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి.
ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం దిశకు స్థానికంగా మెకానిక్ పనులు చేసుకునే ఆసిఫ్ ఇస్లామ్ అన్సారీ అలియాస్ రాజాబాబూ టైర్వాలా పరిచయమయ్యాడు. వారి పరిచయం చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం చంద్రసేన్కు తెలియడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించేందుకు దిశ, ఆమె ప్రియుడు ఆసిఫ్ నిర్ణయించుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం చంద్రసేన్ నిద్రిస్తున్న సమయంలో అతడిని హత్య చేసేందుకు దిశ తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. ఆ తరువాత దిశ తన భర్తను కదలకుండా గట్టిగా పట్టుకోగా ఆసిఫ్ అతడి ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే, చంద్రసేన్ది సహజమరణం అని నమ్మించేందుకు దిశ ప్రయత్నించింది. కానీ పోస్టుమార్టంలో మాత్రం అతడిది హత్యేనని నిర్ధారణ అయ్యింది. దీంతో, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితురాలు తను చేసిన నేరాన్ని అంగీకరించింది.
ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య
RELATED ARTICLES