పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది.
లోక్సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూసుకెళ్లగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. లోక్సభలోకి దూకిన వ్యక్తి .. ఎంపీలు కూర్చొనే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చల్లాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు. చర్చా కార్యాక్రమంలో వున్న వేళ పొగ రావడంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాక ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు.
మరోవైపు.. లోక్సభలో నిరసనకారులు ఉపయోగించిన పొగ డబ్బాను పట్టుకోవడానికి టీవీ రిపోర్టర్లు తమలో తాము పోరాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్నలిస్టులు ఒకరి నుంచి మరొకరు పొగ డబ్బా లాక్కోవడానికి యత్నించారు. ఈ తతంగమంతా కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మీడియా ప్రతినిధులు ఒకరినొకరు తోసుకుంటూ ఆ డబ్బాను లాక్కోవడానికి యుద్ధం చేశారు. ఎట్టకేలకు ఓ జర్నలిస్ట్ ఆ పొగ డబ్బా సంపాదించి .. పార్లమెంట్లో దుండగులు స్మోక్ స్ప్రే చేసింది దీనితోనే అని రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇంతలో ఓ మహిళ సహా మరో ఇద్దరు జర్నలిస్టులు ఆ పొగ డబ్బాను, మైక్ను లాక్కోవడానికి యత్నించారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో జర్నలిస్టులపై పంచులు వేస్తున్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి సాక్ష్యంగా వున్న స్మోక్ డబ్బాను అలా చేస్తున్నారేంటీ.. దీనిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలి కదా అని యశ్వీర్ సింగ్ సంధు అనే వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి అయితే వీడియోలో కనిపిస్తున్న వారు తమను తాము జర్నలిస్టులమని మరిచిపోయినట్లున్నారని పంచ్ విసిరారు.




