spot_img
Thursday, June 5, 2025
spot_img

భర్త తరఫువారిని వేధించడానికి ‘వరకట్న సెక్షన్ల’ ప్రయోగం

వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో భార్యలు.. వరకట్నం, క్రూరత్వ సెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది.వృద్ధులైన అత్తమామలు సహా భర్త తరఫువారిని వేధించడానికి భార్యలు వీటిని ప్రయోగిస్తున్నారని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది.

”క్రూరత్వం అనే పదాన్ని క్రూరంగా దుర్వినియోగం చేస్తున్నారు. నిర్దిష్ట తేదీలు, సమయం, ఘటనలను ప్రస్తావించకుండా ఈ తరహా సెక్షన్లను ప్రయోగించడం వల్ల ప్రాసిక్యూషన్‌ వాదన బలహీనపడుతోంది. అలాగే ఫిర్యాదుదారు చెబుతున్న అంశాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి” అని పేర్కొంది. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 498ఎ (క్రూరత్వం), వరకట్న నిషేధ చట్టం-1961లోని సెక్షన్‌-4ను కింద మోపిన అభియోగాల నుంచి అతడికి విముక్తి కల్పించింది.

”498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్లను ఫిర్యాదుదారులైన భార్యలు తెరపైకి తీసుకురావడం ఆందోళనకరం. వృద్ధులైన అత్తమామలు, భర్త తరఫు దూరపు బంధువులు, వివాహితులైన ఆడపడుచులను నిందితులుగా చేరుస్తున్నారు” అని పేర్కొంది. తాజా కేసులో భార్య ప్రస్తావించిన క్రూరత్వం, వరకట్న వేధింపుల ఆరోపణలు అస్పష్టంగా, నిరాధారపూరితంగా ఉన్నాయని తెలిపింది. సాదాసీదా ఆరోపణల ఆధారంగా దోషనిర్ధారణ చేయకూడదని స్పష్టంచేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular