మహబూబ్నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగజీవాలను గుర్తు తెలియని వ్యక్తులు కర్కశంగా కాల్చిచంపారు
జిల్లాలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో రాత్రి వేళ ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు.. 20కి పైగా కుక్కలను కాల్చి చంపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తుపాకీతో కుక్కలపై కాల్పులు జరిపారు. గ్రామంలోని రోడ్ల వెంట తిరుగుతూ రోడ్లపై ఉన్న కుక్కలను కాల్చి చంపారు. అయితే కుక్కల అరుపులు, తుపాకుల శబ్దాలకు భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. బుల్లెట్ తగిలిన కొన్ని కుక్కలు అక్కడికక్కడే చనిపోయాయి
మరికొన్ని గాయాలతో పరుగులు తీస్తూ రోడ్లపై చనిపోయాయి. 20కి పైగా కుక్కలు ప్రాణాలు కోల్పోగా, మరికొన్ని కుక్కలు గాయపడ్డాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న భూత్పూర్ సీఐ రామకృష్ణ, అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది గ్రామానికి చేరుకుని చనిపోయిన కుక్కలు పడిఉన్న ప్రాంతాలను పరిశీలించారు. పశువైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి పరిశీలించారు. చనిపోయిన కుక్కల శరీరంలో బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి.
అయితే కాల్పులు జరిపిన దుండగులు ఎవరు? ఎందుకు కుక్కలను హత్య చేశారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కల మృత దేహాలు కనిపిస్తున్నాయి. కొన్ని కుక్కలు గాయపడి ప్రాణాలు దక్కించుకునేందుకు పోరాడుతున్నాయి. గాయపడిన కుక్కలకు కూడా వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు.. చనిపోయిన కుక్కల మృతదేహాలను వాహనంలో ఉంచి అక్కడి నుంచి తరలిస్తున్నారు.




