షోషల్ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. అది ఎంతలా అంటే రోజులో ఓ గంటసేపైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి మాధ్యమాలకు దూరంగా ఉండలేకపోతున్నారు.
అవి మారుతున్న పరిస్థితులకు ఎంత లాభం చేకూరుస్తాయో అంతే నష్టాన్ని మిగులుస్తున్నాయి. అందులో చిన్నా పెద్దా, తల్లి కొడుకు, తండ్రి కూతురు అనే తేడా లేకుండా వ్యూస్ ఎక్కువ రావాలనో లేదా మరేదో కారణాల వల్ల కొన్నిసార్లు అందులో అప్లోడ్ చేసే వీడియోలు అసభ్యంగా మారుతున్నాయి.
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఎన్సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు యూట్యూబ్ ఇండియాకు సమన్లు అందజేసింది.
జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో యూట్యూబ్ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హాని కలిగించే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు అసభ్యకర కంటెంట్ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని కోరింది.




