ర్యాపిడో సోమవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్లోని 2,600 పోలింగ్ కేంద్రాలకు నవంబర్ 30వ తేదీన ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ర్యాపిడో ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో ఓటర్ టర్నవుట్ పెంచాలని తాము సంకల్పించినట్టు ర్యాపిడో వివరించింది. తమకు అత్యధికంగా ఉండే యువతను ఓటు కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. మన దేశానికి గల ప్రధాన ఆకర్షణలో ప్రజాస్వామ్యం ముఖ్యమైందని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ప్రతి ఓటూ నమోదయ్యేలా ప్రయత్నం చేస్తున్నందుకు తాము గర్విస్తున్నామని వివరించారు. ప్రయాణ సౌకర్యాల గురించి దిగులు చెంది ఓటు వేయకుండా తప్పుకునే నిర్ణయాలు మానుకుని పెద్ద సంఖ్యలో ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఎన్నికల రోజు ప్రతి పౌరుడు ఓటు వేసేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే తాము ఫ్రీ బైక్ రైడ్ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. ఓటు వేయడంలో ప్రయాణం కూడా ముఖ్యాంశంగానే ఉన్నదని, అందుకే అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికే ఫ్రీ రైడ్ అందిస్తున్నామని ర్యాపిడో ఆ ప్రకటనలో పేర్కొంది.