తమ వీడియోలకు, పోస్టులకు వ్యూస్ కోసం కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు తమ డబ్బులు విపరీతంగా పంచుతూ ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన డబ్బులు పడేస్తూ.. మనీ హంట్ గేమ్గా పేర్కొన్నారు. ఈ అనుచిత చర్యలకు సంబంధించి ఘట్కేసర్ పోలీసులు యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. వివరాలు.. బాలానగర్కు చెందిన యూట్యూబర్ భానుచందర్ మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. ఆ వీడియోలో.. ”మనం హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద ఉన్నాం.. మీ కోసం మనీ హంటింగ్ ఛాలెంజ్.. 20 వేల రూపాయలు అయితే మనీ హంటింగ్ కోసం వేస్తున్నాను.. ఎవరైనా తీసుకోవాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్దకు వచ్చి తీసుకోవచ్చు” అని యూట్యూబర్ పేర్కొన్నారు. ఆ వీడియోలో యూట్యూబర్ ఓఆర్ఆర్పై కరెన్సీ నోట్ల కట్టలను పట్టుకుని కనిపించారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే యూట్యూబర్పై పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ప్రజలు ఓఆర్ఆర్పైకి వచ్చే అవకాశం ఉందని.. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల తరచూ వాహనాలు వేగంగా వెళ్లే ఓఆర్ఆర్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే దీనిని గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది మంగళవారం ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. యూట్యూబర్ భానుచందర్పై బీఎన్ఎస్లోని సెక్షన్లు 125, 292, జాతీయ రహదారి చట్టంలోని సెక్షన్ 8 (బి) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు.




