మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న రేపిస్టు కోసం 200 మంది పోలీసులు నైట్విజన్ కెమెరా గల ప్రత్యేక డ్రోనుతో దట్టమైన అడవిలో విస్తృత గాలింపు చేపట్టగా..పురుగుమందు తాగిన దశలో అతడు పట్టుబడ్డాడు. సెప్టెంబరు 23న సునీల్ కొర్కు (22) అనే యువకుడు అయిదేళ్ల బాలికకు తినుబండారాల ఆశ చూపించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. సిరాలీ ఠాణా పరిధిలోని నది ఒడ్డున స్పృహ తప్పి పడున్న చిన్నారిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు ప్రకటించిన పోలీసులు గత వారం రోజులుగా సమీప అడవిలో విస్తృతంగా గాలించారు.
చివరకు గ్రామస్థుల సాయంతో ఆదివారం ఉదయం మోహన్పుర సమీప పొలంలో సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే పురుగుమందు తాగి ఉన్న అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో భోపాల్ ఆసుపత్రికి తరలించినట్లు హర్దా ఎస్పీ అభినవ్ చౌక్సే తెలిపారు. ఈ గాలింపు చర్యల్లో పోలీసులు ఉపయోగించిన డ్రోన్ కెమెరాకు థర్మల్ సెన్సర్లు అమర్చారు. వాటి సాయంతో దట్టమైన అడవిలోనూ మనుషుల ఉనికిని గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.



