నేట్టింట నేరస్తులు రక రకాల మోసాలకు పలపడుతున్నారు…ఎలా మోసం చేస్తున్నారో ఊహకి కూడా అందకుండా..వాట్సప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన యాప్ అదేకాకుండా సెక్యూర్టీ కి పెట్టింది పేరు ..అలాంటిది ఆ వాట్సప్ వేదికగా కొత్త క్రైమ్ కు తెర తీశారు సైబర్ నేరగాళ్లు..అవును ఇది నిజం ఊహకి అందని వాస్తవం.., ఎలా మోసం చేస్తారో కూడా తెలియదు. మోసం ఎలా జరుగుతుందో గుర్తించలేం. తెలిసే సరికి మోసపోతాం. ఒకసారి మోసపోయాక కోలుకోవడం కష్టం. ప్రస్తుతం మారుమూలలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం లభించడంతో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొన్ని ఉదంతాలు గమనిస్తే రామాయణంలో సీతాపహరణ సందర్భంగా బంగారులేడి వేషంలో మారీచుడు చేసిన మోసం గుర్తుకురాక మానదు. షోషల్ మీడియా లో లేని వ్యక్తి లేడు అనడం లో అతిశయోక్తి కాదు..
సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతోందో.. మరోవైపు వేరొకరి పరువు తీసేందుకు, బెదిరించి లేదా మోసం చేసి డబ్బు దండుకోవడానికి కూడా వేదిక అవుతోంది. చాలామంది యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకున్నవారు తమ ఉనికి బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు రూపు, రూటు మార్చి మోసాలకు తెగబడుతున్నారు.
సోషల్ మీడియాలో నకిలీ ఐడిలతో ఎలా మొసం చేస్తున్నారో తెలుసా..తాము ఎంచుకున్న వారి ఫొటోతో ఫేస్బుక్ తదితర యాప్లకు నకిలీ ఐడీ రూపొందిస్తారు. అది అచ్చం అసలు ఖాతాలా భ్రమించేలా చేస్తారు. దాని నుంచి సంబంధిత వ్యక్తి బంధువులు, స్నేహితులకు డబ్బు పంపించమంటూ మెసేజ్లు చేసి మోసగిస్తారు. మరికొందరైతే ఖాతాల పాస్వర్డ్లను సంపాదించి, ఆ వ్యక్తి వివరాలు, ఫొటోలను తస్కరిస్తారు. వాటి ఆధారంగా అసభ్యకర మెసేజ్లు, ఇమేజ్లు తయారుచేసి బ్లాక్మెయిల్ చేస్తూ వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని మనిషి ఆశనే పెట్టుబడిగా మోసాలు చేస్తున్నారు..ఈ స్కామ్లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా మనీ సెండ్ చేసేలా హ్యాకర్లు ప్రజలను మోసం చేస్తారు. వారు ఫేక్ మనీ రిక్వెస్ట్లు పంపడం లేదా చట్టబద్ధమైన సంస్థల వలె నటించడం వంటి వ్యూహాలు పన్నుతారు. యూపీఐ మనీ రిక్వెస్ట్ ఫ్రాడ్కి గురైతే ఆర్థిక నష్టాలు, భద్రతా సమస్యలు తలెత్తుతాయి.
ఓటీపీ స్కాంలో టూ-ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ కోసం ఉపయోగించే వన్-టైమ్ పాస్వర్డ్లను(ఓటీపీ) ప్రజల నుంచి తెలుసుకునేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఆథరైజ్డ్ ఎంటీటీస్గా నటించడం, హానికరమైన లింక్లను పంపడం లేదా బ్యాంకుల వద్ద బాధితులుగా నటించడం వంటి వ్యూహాలను ఉపయోగిస్తారు. స్పందించినవారి ఖాతాల నుంచి డబ్బు లాగేస్తారు
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి చెందిన ఎస్.జాబీర్(యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల గత ఆది, సోమవారాల్లో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇంతలో ఎస్బీఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ ఎస్బీఐ లింక్ ప్రత్యక్షమైంది.
ఇది నమ్మిన జాబీర్ అచ్చు ఎస్బీఐ యాప్ను తలపించిన ఆ నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్కు సంబంధించిన వివరాలతో లాగిన్ అయ్యారు. వెంటనే ఆయన అకౌంట్లోని నగదు మాయమైంది. యాప్ డబుల్తో మోసం చేశారని గ్రహించిన ఆయన తనతో పాటు మరికొందరు ఉపాధ్యాయులు కూడా ఇలాగే మోసపోయారని గుర్తించారు. వారితో కలిసి వెళ్లి రాయ చోటి స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యనారాయణకు తాము మోసపోయిన విధానాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు..
కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ డీపీ(డిస్ప్లే పిక్చర్)తో సైబర్ మోసగాళ్లు మోసగించే యత్నం చేశారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆయన పరిచయస్తులతో కాంటాక్ట్లోకి వెళ్లారు. క్షేమసమాచారాలు అడిగినట్లుగా మెసేజ్లు పంపసాగారు. దీంతో వీసీ అప్రమత్తమయ్యారు. మోసగాళ్ల మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని రెండు రోజుల క్రితం ఆయన వైవీయూ గూపుల్లో, వ్యక్తిగతంగా అందరికీ మెసేజ్లు పంపారు.
కరోనా ఉధృతి వేళ ఇంటి నుంచి పనిచేసే విధానానికి బాగా ఆదరణ పెరిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం కొలువుల కోసం అంతర్జాలంలో అన్వేషించడం ఎక్కువైంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ‘తక్కువ పని గంటలు… ఎక్కువ సంపాదన’అంటూ డిజిటల్ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
వీరిని ఎవరైనా సంప్రదిస్తే డేటా ఎంట్రీ, ప్రముఖుల సామాజిక మాధ్యమ ఖాతాల్లో వచ్చే పోస్టులను లైక్, షేర్ చేయడంవంటి పనులు ఉంటాయని చెబుతున్నారు. పని సులభమని, వేలల్లో సంపాదించుకోవచ్చని చెబుతూ నకిలీ వెబ్సైట్లతో ముగ్గు లోకి దించుతున్నారు. మీకు అధిక ఆదాయం కావాలంటే కొంత పెట్టుబడి పెట్టాలంటూ వల విసురుతున్నారు.