ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రొటోకాల్ సలహాదారునని చెప్పుకొంటూ మోసాలు చేస్తున్న పాత నిందితుడిని హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు పట్టుకున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన బుసి ప్రవీణ్సాయి (23).. వనస్థలిపురంలో ఉంటూ.. తేలిగ్గా డబ్బు సంపాదనకు ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో బేగంపేటకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ వీరభద్రరావుకు.. తన డ్రైవర్ ద్వారా ప్రవీణ్సాయితో పరిచయం ఏర్పడింది. అబ్దుల్లాపూర్మెట్లోని గండి మైసమ్మ ఆలయం దగ్గర ప్రభుత్వ భూమి ఉందని, దానిని రూ.25 లక్షలకే ఇప్పిస్తానని నిందితుడు నమ్మించాడు. దీంతో వీరభద్రరావు తొలి విడత కింద రూ.2.10 లక్షలను ఆన్లైన్లో బదిలీ చేశారు. మరో రూ.6 లక్షలు నేరుగా ఇచ్చారు.
వీరభద్రరావు ఆ స్థలాన్ని చూసేందుకు వెళ్లగా.. ఇతరులు నిర్మాణాలు చేపడుతుండడాన్ని గుర్తించారు. ఆరా తీయగా ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదని తేలింది. దీంతో ప్రవీణ్ మోసం చేశాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్, అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ బృందాలు నిందితుడిని శనివారం పెద్దఅంబర్పేట వద్ద అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, నిఘా విభాగంలో పనిచేస్తున్నట్లున్న నకిలీ లేఖ, రాష్ట్ర హోంమంత్రి పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్, కారు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్కు సహకరించిన పద్మారావునగర్ వాసి సునీల్పై కేసు నమోదు చేశారు. నిందితుడిపై కూకట్పల్లి, సైఫాబాద్, బేగంపేట, అంబర్పేట పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.
CMO కార్యాలయం లో కేటు గాడు
ఇన్నోవా కార్, సెల్ ఫోన్ సెజ్ చేసిన పోలీసులు





