రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నాం. వీరు కోటి రూపాయలు విలువైన 360 కిలోల గంజాయిని రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్కి తరలిస్తున్నారు. మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ముందు ఒక పైలెట్ వాహనంతో వెళ్తున్నారు. ఈ కేసులో యూపీకి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్లను అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుండి 360 కేజీల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నాం. డ్రగ్స్, గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం. డ్రగ్స్, గంజాయి ఎవరు సప్లై చేసినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.




