పెండింగ్ చలాన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అవకాశం కల్పించింది.
2024 జనవరి 10 వరకు చలాన్లు చెల్లించేందుకు సమయం ఉంది. కాగా.. పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి వాహనదారులను దోచుకుంటున్నారు.
www.echallantspolice.in పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. ఈ వెబ్సైట్ ద్వారా వాహనదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సైట్లో పేమెంట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
www.echallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో మాత్రమే వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదండోయ్.. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో కూడా పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చునని చెప్పారు. కాగా.. నకిలీ వెబ్సైట్ను ఎవరు క్రియేట్ చేశారు అనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇక బైక్లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, భారీ వాహనాలపై 50 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పై 90 శాతం రాయితీలను ప్రకటించారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.




