ఉత్తర్ప్రదేశ్లో పాతకక్షలతో ఓ ఎంసీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు అతణ్ని అమానుషంగా కొట్టి, చెవి పక్కన తుపాకీ పెట్టి కాల్చి భయపెట్టేందుకు ప్రయత్నించారు.
దాదాపు 12 మంది నిందితులు ఒకరి తర్వాత మరొకరు విద్యార్థి నోట్లో మూత్రం పోసి తాగమని చిత్రహింసలు పెట్టారు. చెప్పులపై ఉమ్మి వేసి నాలుకతో నాకాల్సిందిగా బలవంతపెట్టారు. ఈ కేసులో హెడ్కానిస్టేబులు ధర్మేంద్ర యాదవ్తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. కాన్పుర్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న స్నేహితురాలిని కలిసేందుకు మరో మిత్రుడితో కలిసి వచ్చిన బాధిత విద్యార్థి (23)ని అప్పటికే కారులో అక్కడ మాటువేసిన నిందితులు తుపాకీ చూపించి కిడ్నాప్ చేశారు.
నగరానికి దూరంగా రైల్వేట్రాక్ వద్దకు విద్యార్థిని తరలించారు. నిందితుల్లో ఒకడైన హిమాంశు యాదవ్ తన తండ్రి అయిన హెడ్కానిస్టేబులు ధర్మేంద్ర యాదవ్కు కబురు పంపి అక్కడకు రప్పించాడు. అందరూ కలిసి విద్యార్థిపై మూకుమ్మడి దాడి చేసి దారుణంగా కొట్టి, నరకం చూపించారు. ఈ కేసులో అరెస్టయిన ఇంటెలిజెన్స్ హెడ్కానిస్టేబుల్ ధర్మేంద్ర యాదవ్ను ఉన్నతాధికారులు సస్పెండు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఎంసీఏ విద్యార్థిపై స్వయంగా ధర్మేంద్ర యాదవ్ హత్యాయత్నం కేసు పెట్టి ఉండటం గమనార్హం.




