మలేరియా ఆఫీసర్గా పనిచేస్తున్న జ్ఞానశ్రీ. ఆమె చేసిన సేవలకు గాను ఇటీవల ప్రభుత్వం నుంచి రివార్డులు కూడా అందుకున్నారు. అంతవరకు బాగానే ఉంది.
అయితే ఆమె పనిచేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తారట. ఆమెపై ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చినా డోంట్కేర్.. నా దారి, అడ్డదారి అంటున్నారట. ఇదే క్రమంలో దోర్నాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇజ్రాయెల్కు చెందిన పీఆర్సి బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీ తొలుత 4 లక్షలు డిమాండ్ చేశారు. 2015, 2021 పీఆర్సికి సంబంధించిన 16.86 లక్షల బిల్లులు మంజూరుచేసేందుకు 25 శాతం లంచం ఇవ్వాలని కోరారు.
అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఇజ్రాయెల్ తనకు పీఆర్సి పెండింగ్ బిల్లులతో పాటు ప్రమోషన్లో కూడా జాప్యం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మలేరియా శాఖ రీజనల్ డైరెక్టర్ను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశం పెండింగ్లో ఉండగానే మలేరియా అధికారిణి జ్ఞానశ్రీ తనకు లంచం ఇవ్వాల్సిందేనని మరోసారి ఇజ్రాయెల్ను డిమాండ్ చేయడంతో చివరకు 1.40 లక్షలకు బేరం కుదిరింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు ఏసీబీ అధికారులు పక్కాగా దాడులు నిర్వహించి ఇద్దరు మలేరియా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను పట్టుకున్నారు.
ఒంగోలులోని మలేరియా కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా మలేరియా అధికారిణి జ్ఙానశ్రీ, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శీనయ్యలను లంచం తీసుకున్నారన్న కారణంగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ వ్యవహారంలో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శీనయ్య 1.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శీనయ్య ద్వారా 1.40 లక్షల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా మలేరియా అధికారిణి జ్ఙానశ్రీని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు తెలిపారు.




