యజమాని లైంగిక దాడికి పాల్పడుతుండటంతో 18 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తూర్పు తక్కెళ్ళపల్లి గ్రామానికి చెందిన సువర్ణకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబం తో సంతోష్ నగర్ లో నివాసం ఉంటుంది. రెండో కుమార్తె దివ్య స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీ లో ది బాబ్ ఫ్యామిలీ సెలూన్ లో మురళి అనే వ్యక్తి వద్ద గత ఆరు నెలలుగా పని చేస్తూ అక్కడే నివాసముంటుంది. సెలూన్ యజమాని మురళి అమ్మాయిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడని, సోమవారం సాయంత్రం సమయంలో మరోసారి యజమాని మురళి ఆ యువతి పై మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించగా అమ్మాయి తిరస్కరించింది.
అవమాన భారం తట్టుకోలేక యువతి శానిటైజర్ ని సేవించి తన తల్లికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న తల్లి దివ్య ను యజమానితో కలిసి నక్షత్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించి ఆరోగ్యం నిలకడగా ఉంది అనడంతో ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం మరోసారి దివ్య ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బైరమల్ గూడ ఆవేర్ గ్లోబల్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు యువతిని పరీక్షించి అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో మృతదేహాన్ని టీచర్స్ కాలనీ సెలూన్ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.




