చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా ఆయన ఎప్పటికప్పుడు ప్లేస్ మార్చుతుండటం గమనార్హం.
మంచిర్యాలలో నిన్న జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడ్తానంటూ చెప్పు చూపించడమే కాకుండా ‘లక్షమందిమి ఉన్నం.. పండవెట్టి తొక్కుతం’అంటూ కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో చెప్పు చూపించడాన్ని సీరియస్ గా తీసుకున్న మంచిర్యాల కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుమన్ పై ఐపీసీ 294బీ, 504, 506 సెక్షన్ల కింద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న సుమన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత బంజారా హిల్స్ నందినగర్ లోకి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది. మంచిర్యాలతో పాటు రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లకు బాల్క సుమన్ పై ఫిర్యాదులు వచ్చాయి.
బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను, తిట్లను పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత సమర్థించారు. ఒక దళిత బిడ్డపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్,బల్కా సుమన్ వైఖరి మార్చుకోకపోతే విద్యార్థులుగా తగిన గుణపాఠం చెప్తామన్నారు.




