నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఈక్రమంలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ప్రకటన ఇవ్వడంతో హైదరాబాద్కు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వ హాయంలో పరీక్షలు వాయిదా పడడంతో సొంత ఊళ్లకు వెళ్లిన నిరుద్యోగ అభ్యర్థులు మళ్లీ కొత్త ప్రభుత్వం రావడం.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడంతో సిటీకి తరలి వస్తున్నారు. దీంతో సిటీలోని హాస్టల్స్కు ఫుల్ డిమాండ్ పెరిగింది.
ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం సిటీలో దాదాపు ఎనిమిది నుంచి పదివేల హాస్టల్స్ ఉన్నాయి. అందులో 30 శాతం ఐటీ సెక్టర్లో ఉండగా మిగతా 70శాతం దిల్ సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అమీర్ పేట్ ఏరియాలో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఇరు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలతో సిటీకి వచ్చిన నిరుద్యోగులకు ఇక్కడ నిరాశే ఎదురవుతోంది. సిటీ హాస్టల్స్లో ఫీజు మోత మోగుతోంది. నెలకు ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.12 వేలకు పైగా ఫీజు డిమాండ్ చేస్తున్నారు. మధ్యతరగతికి చెందిన నిరుద్యోగులు హాస్టల్ ఫీజుల కోసం పార్ట్ టైం జాబులు చేస్తూ కోచింగ్ తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఖర్చులు,ఏ నోటిఫికేషన్ వేయడానికి ఎంతకాలం పడుతుందో తెలియక, సరైన టైం టేబుల్ లేకపోవడంతో నిరుద్యోగులు గందరగోళంలో పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.




