ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కువ లిమిట్తో కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు 68 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.19 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి కెనరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు ఎలాంటి చార్జీలు లేకుండా సుమారు రూ. 5 లక్షల లిమిట్తో మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నామని నమ్మించారు. దానికి బాధితుడు సరే అనడంతో వెరిఫికేషన్ కోసమని చెప్పి ఒక లింక్ ను పంపారు. అతడితో దానిని డౌన్లోడ్ చేయించి, అందులో వివరాలు నమోదు చేయించారు. అలాగే కేవైసీ అప్డేట్ కోసమని బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్దు నంబర్(ATM Card No), సీవీవీ వివరాలు నమోదు చేయించారు.
మరుసటి రోజు ఉదయం వరకు క్రెడిట్ కార్డు అప్డేట్ అయిపోతుందని, కార్డ్లెస్ పేమెంట్స్కు వినియోగించుకోవచ్చని నమ్మబలికాడు. మరుసటి రోజు అతను ఫోన్ను చెక్ చేసుకోగా, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 2,19,226లు మొత్తం డెబిట్ అయ్యాయి. ఖాతాలో సున్నా బ్యాలెన్స్ ఉంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




