సైబర్ క్రైమ్స్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిని హడలెత్తిస్తున్న మాట. ఈ సైబర్ క్రైమ్స్ కు ఏ ఒక్క ఫ్లాట్ ఫామో వేదిక కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ప్రతి ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఆసరాగా తీసుకొని రెచ్చిపోతున్నారు నేరగాళ్లు. యూజర్స్ ను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేసి మోసం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోనే చేరి మోసపోతున్నారు నెట్ ఫ్లిక్స్ యూజర్స్.
నెట్ ఫిక్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికి 23 దేశాల్లో ఇలాంటి స్కామ్స్ బయటపడ్డాయి. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో Bitdefender తాజా నివేదిక నెట్ఫ్లిక్స్ చందాదారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నెట్ ఫిక్స్ పేరుతో భారీ స్కామ్ జరుగుతున్నాయని.. హ్యాకర్లు నకిలీ సందేశాలను పంపి ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నారని తెలిపింది.
నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ స్కామ్ –నిజానికి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లను మోసం చేయడం, వారి ఖాతా ఆధారాలు లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించటమే ప్రధాన లక్ష్యంగా ఈ స్కామ్స్ జరుగుతున్నాయి. స్కామ్స్ చేయటానికి హ్యాకర్లు రెండు విధానాలను ఉపయోగిస్తున్నారు.అందులో ఒకటి.. సబ్స్క్రైబ్ చేసుకుంటే బహుమతులు వస్తాయి అంటూ యూజర్స్ ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో విధానంలో వెంటనే నెట్ఫ్లిక్స్ ను అప్ గ్రేడ్ చేయకపోతే యాక్సెస్ కోల్పోతారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ రెండింటినీ నమ్ముతున్న యూజర్స్ మోసపోతున్నారు.
నిజానికి ఈ స్కామ్స్ సెప్టెంబర్ లో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో స్కామ్స్ జరిగాయని గ్రీస్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్ సహా 23 దేశాల్లో ఈ స్కామ్స్ బయటపడ్డాయి. యూజర్స్ ను మభ్య పెట్టడానికి హ్యాకర్స్ కొత్త దారులను వెతుక్కుంటున్నారు. మీ చెల్లింపు ప్రాసెస్ చేయడంలో సమస్య ఉంది. ఇక సేవలను వెంటనే సైన్ ఇన్ చేయకపోతే మీ అకౌంట్ ఆగిపోతుంది అంటూ దానికి సంబంధించిన ఒక లింక్ ని పంపిస్తారు. ఇక ఆ లింకులో లాగిన్ అయితే వెంటనే సమాచారం మొత్తం హ్యాక్ అయిపోతుంది. నకిలీ పేజీలోకి తీసుకుపోయి తప్పుడు లింక్స్ ను చూపిస్తుంది. ఆ సైట్స్ లోకి వెళ్ళగానే మీ పేరు, పాస్వర్డ్, క్రెడిట్ కార్డుతో సహా మిగిలిన ముఖ్యమైన వివరాలు అన్ని స్కాన్ అయిపోతాయి.అందుకే ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని నెట్ఫ్లిక్స్ తన యూజర్స్ ను హెచ్చరిస్తుంది. నెట్ఫ్లిక్స్ ఎప్పుడూ ఎస్ఎంఎస్ ద్వారా సంబంధిత నోటిఫికేషన్లను పంపించదని.. ఇలాంటి వాటిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.