మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది. ఈ క్రమంలో దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వేతన పెంపు ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కంపెనీలు తమ మూడవ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు సిద్ధం అవటం కూడా ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తోంది. పైగా దీర్ఘకాలం కొనసాగిన మందగమనం నుంచి కంపెనీలు బయటపడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిన్న దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు అందించాల్సిన వేతన పెంపులను ప్రస్తుతం నాలుగో త్రైమాసికానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన కేవలం ఒక్క రోజు తర్వాత దేశంలోని మూడవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ HCLTech అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జూనియర్ ఉద్యోగులకు వేతనాల పెంపును పాక్షికంగా ప్రారంభించిందని వెల్లడైంది. ప్రస్తుతం జూనియర్ లెవెల్ ఉద్యోగుల్లో చాలామందికి దాదాపు 1-2 శాతం ఇంక్రిమెంట్ అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే వీరిలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన ఉద్యోగులకు కంపెనీ 3-4 శాతం మేర వేతన పెంపును అందించిందని సమాచారం.కంపెనీ ప్రస్తుతం అందించిన హైక్స్ టెక్కీలను పూర్తిగా నిరాశకు గురిచేశాయని తెలుస్తోంది. గతంలో కంపెనీ సగటున 7 శాతం వేతన పెంపుతో పాటు అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి 12-15 శాతం హైక్స్ అందించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం అందిస్తున్న వేతన పెంపులు చాలా తక్కువగా అందిస్తూ కంపెనీ భిన్నంగా పే హైక్స్ ప్రకటించటం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది. HCLTech ప్రస్తుతం.. E0, E1, E2 కేటగిరీల్లోని సిబ్బందికి వేతన పెంపులను ప్రారంభించిందని సమాచారం. వీరు దాదాపు 10 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం E3 బ్యాండ్ ఆపైన ఉండే మిడిల్ అండ్ సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వేతన పెంపులను ప్రకటించలేదు.హెచ్సిఎల్టెక్ మేనేజ్మెంట్ FY24లో కూడా సీనియర్ నుంచి మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు సంవత్సరానికి వేతన పెంపు సైకిల్ దాటవేసినట్లు తెలుస్తోంది. E0-E2 మధ్య స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కంపెనీ నుంచి వేతన పెంపులకు సంబంధించిన వివరాలను డిసెంబరులోనే అందుకున్నట్లు తెలుస్తోంది. E4 స్థాయి స్థాయి ఉద్యోగులకు కంపెనీ మూడేళ్లుగా ఎలాంటి వేతన పెంపులను ప్రకటించలేదని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ మనీకంట్రోల్ కి అందిన అంతర్గత సమాచారం ద్వారా విషయం బయటకు వచ్చింది. కొత్తగా చేరిన ఉద్యోగులు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటేనే ప్రస్తుత హైక్ సైకిల్ లో వేతన పెంపుకు అర్హులుగా పరిగణించినట్లు కంపెనీ వెల్లడించి నట్లు సమాచారం




