spot_img
Monday, July 21, 2025
spot_img

యూట్యూబ్‌లో వెతికి మరీ.. తండ్రిని చంపిన కొడుకు

తండ్రిని ప్లాన్ చేసి హత్య చేశాడు.. ఏమీ తెలియనట్లుగా నటించాడు. కేసు దర్యాప్తును వేగవంతం చేయండి అంటూ పోలీసుల దగ్గర బాగానే నటించాడు.. ఏకంగా ధర్నాకు కూడా దిగాడు.తండ్రిపై కుమారుడికి ఎంతో ప్రేమో అనుకున్నారు. అక్కడితో ఆగకుండా తండ్రి హత్య నేరాన్ని మరొకరిపై వేసేందుకు ప్రయత్నించాడు.. కానీ చివర్లో అనుకోకుండా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు దర్యాప్తులో మనోడు చెప్పిన మర్డర్ ప్లాన్ గురించి తెలిసి అందరూ అవాక్కయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లి ములకలపెంటకు చెందిన కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద మరణం కలకలంరేపింది. గత శనివారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు ఫిర్యాదుతో.. పక్కపొలం రైతు, అతడి గుమస్తాను అనుమానితులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు హత్య చేసినట్లు గుర్తించారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే మనోడు అసలు సంగతి చెప్పుకొచ్చాడు.శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు ఎంబీఏ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. బెట్టింగులకు అలవాటుపడి అప్పులు చేశాడు.. ఏం చేయాలో తెలియక సొంత ఊరికి వచ్చేవాడు. కుమారుడు మారతడనే ఆశతో తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు. పుల్లారావు భార్య, ఇద్దరు కూతుళ్లతో ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి పొలం సాగు చేసుకుంటూ.. తల్లి పాడి గేదెలతో జీవనం సాగిస్తున్నారు. పుల్లారావు సొంత ఊరికి వచ్చిన బుద్ధి మారలేదు.. మళ్లీ బెట్టింగ్‌లతో అప్పులు చేశాడు.

తాను చేసిన అప్పులు చెల్లించేందుకు.. ఒక ఎకరం పొలం అమ్మాలని పుల్లారావు తండ్రి శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చాడు. తండ్రి పొలం అమ్మేందుకు ఒప్పుకోలేదు.. అప్పుడు తండ్రిని చంపితే ఆస్తి తనకు వస్తుందని భావించాడు. తండ్రిని చంపడానికి యూట్యూబ్‌లో వెతికాడు.. ఒకే దెబ్బతో చంపడం ఎలాగని సెర్చ్ చేశాడు. హత్య జరిగిన రోజు పుల్లారావు పొలం వెళ్లాడు.. అక్కడ చుట్టుపక్కల రైతులతో కొద్దిసేపు మాట్లాడాడు. సాయంత్రం వేళ ఎవరూ లేని సమయంలో తండ్రిన కర్రతో కొట్టి చంపాడు.. తర్వాత అక్కడి నుంచి బైక్‌పై మైలవరం వెళ్లిపోయాడు.

సాయంత్రమైనా శ్రీనివాసరావు ఇంటికి రాకపోవడంతో కుమారుడికి తల్లి ఫోన్ చేసింది. అయితే తాను ఉదయం నుంచి మైలవరంలో ఉన్నానని చెప్పాడు. వెంటనే ఆమె బంధువుల్ని పొలం దగ్గరకు వెళ్లి చూడమని చెప్పడంతో.. అక్కడికి వెళ్ల పరివీలిస్తే శ్రీనివాసరావు మృతదేహం కనిపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పుల్లారావు.. పక్కపొలం వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు. దీంతో పోలీసులు పక్క పొలం యజమాని, గుమస్తాలను అనుమానించి.. ఆ కోణంలో దర్యాప్తు చేశారు. తండ్రి కేసులో విచారణ వేగంగా చేయడం లేదని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా జాతీయ రహదారిపై ధర్నాకు దిగేలా చేశాడు. రెండ్రోజుల తర్వాత పోలీసులకు పుల్లారావు తీరుపై అనుమానం వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే పొంతలేని సమాధానాలు చెప్పాడు.. చివరికి తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు. పుల్లారావును పోలీసులు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular