‘ఆ నలుగురు’ (Aa Naluguru) ఎవరు? ఇప్పుడీ ప్రశ్న ఎంతో మందిలో ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్… ‘థియేటర్స్ బంద్’.ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతలు అన్నట్టు మొదలైన ఈ సమస్య… ‘పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆ నలుగురు’ కింద మారింది.
పవర్ స్టార్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు సినిమా హాళ్లకు తాళం వేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక చిత్రసీమ సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు అందరినీ పవన్ ముందుకొస్తే… ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. ఆ విషయం అటుంచితే… ‘ఆ నలుగురు’ ఎవరు? అనేది కొందరిలో ఉన్న ప్రశ్న.
ఎవరు ఆ నలుగురు? అగ్ర నిర్మాతలేనా!?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయడం నుంచి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వరకు అన్ని రంగాల్లో ఉన్న నిర్మాతలు కొందరు ఉన్నారు. అయితే… సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ – ఈ నలుగురు మిగతా నిర్మాతలకు చాలా అందనంత ఎత్తులో ఉన్నారు.
సురేష్ బాబు చేతిలో రామానాయుడు స్టూడియో ఉంది. ఫిల్మ్ షూటింగ్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అందులో చేసుకోవచ్చు. ‘మిస్ ఇండియా’ సినిమాలో కీర్తీ సురేష్ రెస్టారెంట్ పెడతారు కదా… అమెరికాలో! ఆ సెట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో వేశారు. ‘టాక్సీవాలా’లో విజయ్ దేవరకొండ గ్యారేజ్ సెట్ కూడా సేమ్ ప్లేస్లో వేశారు. ఎన్నో సినిమాల్లో బస్ స్టాప్ సీన్స్ రామానాయుడులో తీశారు. అక్కడ ప్రివ్యూ థియేటర్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి అవసరమైన సరంజామా ఉంది. సురేష్ బాబు దగ్గర డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటు లీజుకు తీసుకున్న థియేటర్లు ఉన్నాయి.
ఏషియన్ సునీల్ విషయానికి వస్తే… మహేష్ బాబు (ఏఎంబీ), అల్లు అర్జున్ (ఏఏఏ) వంటి స్టార్ హీరోల భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్లు స్టార్ట్ చేశారు. రవితేజతో వనస్థలిపురంలో ఒక మల్టీప్లెక్స్ కడుతున్నారు. మరికొంత మంది హీరోలతో అటువంటి వెంచర్స్ (మల్టీప్లెక్స్)లు ప్లాన్ చేశారు. ఎగ్జిబిషన్ సెక్టార్లో ఏషియన్కు బలమైన వ్యవస్థ ఉంది. గతంలో తెర వెనుక ఉన్న ఏషియన్ సునీల్, కొన్ని సంవత్సరాలుగా నిర్మాణంలోనూ అడుగు పెట్టారు. నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’, నాగార్జునతో ‘ది ఘోస్ట్’ తీశారు. ఇప్పుడు ధనుష్ – నాగార్జునల ‘కుబేర’ తీస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు… భారీ బడ్జెట్ ఫిలిమ్స్ నుంచి కాన్సెప్ట్ & కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వరకు అన్నీ చేస్తున్నారు. ఇద్దరికీ డిస్ట్రిబ్యూషన్లో బలమైన నెట్వర్క్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఆ నలుగురు’ అంటే వినిపించేది వీళ్ళ పేర్లే. గతంలో నట్టి కుమార్ వంటి నిర్మాతలు ‘ఆ నలుగురూ’ థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు ఇవ్వడం లేదని ఆరోపణలు చేసిన రోజులు ఉన్నాయి. అయితే చిన్న సినిమాలకు థియేటర్లు ఇచ్చినా ప్రేక్షకులు రావడం లేదని అగ్ర నిర్మాతలు చెబితే సమంజసం అనిపించింది కనుక ఎక్కువ విమర్శలు రాలేదు. నట్టి కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం కలగలేదు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారనే ప్రచారం మొదలైంది. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం వేడెక్కింది.
ఎందుకు ఆ నలుగురి మీద విమర్శలు?
డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ‘దిల్’ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్, సురేష్ బాబు కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. సొంతంగా కట్టుకున్నవి కొన్ని అయితే… లీజుకు తీసుకుని మెయింటైన్ చేస్తున్నవి మరికొన్ని.గతంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేది. కానీ, ఇప్పుడు సురేష్ బాబు – ఏషియన్ సునీల్ కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దిల్ రాజు ఒక్కోసారి వీళ్ళతో కలిసి సినిమాలు కొని విడుదల చేస్తారు. మెజారిటీ తమిళ్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది వీళ్ళే. అల్లు అరవింద్ కూడా కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘కాంతార’ను తెలుగులో విడుదల చేసింది ఆయనే. ‘బేబీ’, ‘పొలిమేర 2’ వంటి సినిమాల విడుదల వెనుక ఉన్నది ఆయన గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్.
ప్రొడ్యూస్ చేసినవి కావచ్చు… డిస్ట్రిబ్యూట్ చేసేవి కావచ్చు… తమ తమ సినిమాలు థియేటర్లలోకి వచ్చేటప్పుడు ఒక విధంగా, తమ సినిమాలు లేనప్పుడు మరో విధంగా ‘ఆ నలుగురు’ వ్యవహరిస్తారని పేరుంది. ఏషియన్ సునీల్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘కుబేర’ జూన్ 20న విడుదలకు సిద్ధమైనా… ఆ సినిమాను పక్కన పెడితే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో తమకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం కోసం మిగతా మిత్రులతో కలిసి థియేటర్స్ బంద్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని ఇండస్ట్రీలో గుసగుస. ‘ఆ నలుగురు’ వీళ్ళేనని ఎవరూ పైకి చెప్పరని, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఇప్పుడు ఏకంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి ‘పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి’ అంటూ స్టేట్మెంట్ రావడం గమనార్హం. మరి పవన్ క్యాంపు పేర్కొంటున్న ‘ఆ నలుగురు’ వీళ్లేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.
‘ఆ నలుగురు’ ఎవరు? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా??
RELATED ARTICLES