spot_img
Monday, March 23, 2026
spot_img

ఉస్మానియా విశ్వవిద్యాలయం వివాదం (ఓయూ)  ప్రొఫెసర్లకు రూ.40 వేల అద్దె…. ప్రైవేటు వ్యక్తులకు వెయ్యి రూపాయలకే

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారనే ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఓయూలోని ప్రొఫెసర్లకు కేటాయించాల్సిన క్వార్టర్లను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి, ఈ ప్రక్రియలో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు క్వార్టర్స్ ఇవ్వడంపై ఓయూ వైస్ ఛాన్సలర్ (VC)ని విచారించగా.. క్వార్టర్లు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే.. ఈ కేటాయింపులు తన హయాంలో జరగలేదని.. గతంలో ఇన్‌ఛార్జి వీసీగా ఉన్న వ్యక్తి ఈ క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ప్రస్తుత వీసీ వెల్లడించారు. మినిట్స్ బుక్‌లో ఈ విషయాన్ని తాను కూడా చూసినట్లు పేర్కొన్న ఆయన.. తనకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వీసీ వివరణ పట్ల విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు క్వార్టర్స్ కేటాయించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ ప్రొఫెసర్లు ఈ క్వార్టర్స్‌లో నివాసముంటే వారి వేతనం నుంచి నెలకు రూ. 40,000 కట్ చేస్తారని, కానీ అదే క్వార్టర్లను ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కేవలం రూ. 1,000 కే ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలు తప్పు పడుతున్నాయి. ఈ భారీ వ్యత్యాసం అవినీతికి నిదర్శనమని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ఈ ఇష్యూకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

వాస్తవానికి.. ఓయూలో ఉన్న క్వార్టర్లు ప్రొఫెసర్లకు కేటాయిస్తే వారి నుంచి రూ. 40,000 అద్దె వసూలు చేస్తున్నారు. బయట ఇదే సౌకర్యాలున్న ఇళ్లకు ఇందులో సగం చెల్లిస్తేనే సరిపోతుండటంతో, అంత మొత్తం చెల్లించడానికి ప్రొఫెసర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఆ క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఖాళీలను పూరించడానికి, లేదా వాటి ద్వారా కొంత ఆదాయాన్ని పొందడానికి కొందరు అధికారులు ఈ క్వార్టర్లను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లు చెబుతున్నారు.

అయితే.. ప్రొఫెసర్లకు సైతం తక్కువ అద్దెకు, అంటే మార్కెట్ రేటుకు అనుగుణంగా కేటాయిస్తే వారు ఉండటానికి అవకాశం ఉంటుందని విద్యార్థి సంఘాలు, కొంతమంది ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు పునరాలోచన చేసి, యూనివర్సిటీ ప్రయోజనాలను కాపాడాలని.. విద్యార్థుల, ఉపాధ్యాయుల హక్కులను గౌరవించాలని వారు కోరుతున్నారు. ఈ వివాదం ఓయూ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, కాబట్టి దీనిపై పారదర్శకమైన విచారణ జరిపి, దోషులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular