
నారపల్లిలో గృహ నిర్మాణ యజమానులపై బెదిరింపులు – సిండికేట్గా మారిన అక్రమ వసూళ్ల ముఠా?
బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కడ ప్రారంభమైనా ఆ సమాచారం నకిలీ విలేకరులకు చేరగానే గృహ యజమానుల సమస్యలు మొదలవుతున్నాయని పలువురు వాపోతున్నారు. అప్పులు చేసి, ఎన్నో కష్టాలు భరించి సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న వారిపై నకిలీ విలేకరులు డేగల్లా వాలిపడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా నారపల్లి ప్రాంతంలో ఓ గృహ యజమాని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి స్లాబ్ వేసిన వెంటనే నకిలీ విలేకరులు రంగప్రవేశం చేసినట్టు సమాచారం. లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇందులో మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే—కొంతమంది నకిలీ మున్సిపల్ అధికారుల్లా నటిస్తూ ఈ వ్యవహారానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇది మొత్తం ఒక సిండికేట్లా మారి, గృహ నిర్మాణ యజమానుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే గ్యాంగ్గా మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించే బిల్డర్లను వ్యాపార ఉద్దేశంతో డబ్బులు అడిగితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చుగానీ, కేవలం సొంత ఇంట్లో నివసించాలనే ఉద్దేశంతో సాధారణ ఇల్లు కట్టుకునే తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని బాధిత గృహ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలాంటి నకిలీ విలేకరులు ఎక్కడ కనిపించినా లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. నకిలీ విలేకరుల కారణంగా నిజమైన జర్నలిస్టుల పరువు కూడా దెబ్బతింటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
నకిలీ విలేకరులు, గృహ నిర్మాణ వేధింపులు, నారపల్లి వార్తలు, అక్రమ వసూళ్లు, ఫేక్ జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ బెదిరింపులు, సిండికేట్ ముఠా, కోబ్రా న్యూస్ కి సమాచారం ఇవ్వండి



